అవి పన్ను మినహాయింపు పరిధిలోకి రావు
ABN , First Publish Date - 2022-02-23T07:57:38+05:30 IST
ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను రోగులకు సూచించాలంటూ(ప్రిస్ర్కైబ్ చేయాలంటూ) వైద్యులకు తాయిలాలు ఇవ్వడం తెలిసిందే. ...
డాక్టర్లకిచ్చే తాయిలాలపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను రోగులకు సూచించాలంటూ(ప్రిస్ర్కైబ్ చేయాలంటూ) వైద్యులకు తాయిలాలు ఇవ్వడం తెలిసిందే. వీటిలో విదేశాల్లో జల్సాలు వంటివి కూడా ఉంటాయి. అయితే.. ఇలాంటి ఆఫర్లను మెడికల్ ప్రాక్టిషనర్లు స్వీకరించడం నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డాక్టర్లకు తాయిలాలు ఇచ్చిన కంపెనీలు ఆ ఖర్చుకు పన్ను మినహాయింపు కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అపెక్స్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ మల్టీవిటమిన్ ఉత్పత్తి అయిన ‘జింకోవిట్’ను రోగులకు సిఫారసు చేసేలా ప్రిస్ర్కిప్షన్లు ఇవ్వాలంటూ పలువురు వైద్యులకు బహుమతులు అందజేశారు. వాటికి సంబంధించిన రూ. 4.7 కోట్ల ఖర్చును ఆదాయపన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేసుకున్నారు. దీన్ని ఐటీ శాఖ తిరస్కరించింది. దీనిపై హైకోర్టులను సదరు సంస్థ ఆశ్రయించింది. ఆ కోర్టులూ ఒప్పుకోలేదు. దీంతో సుప్రీంలో అప్పీలు వేసింది. ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఫార్మా కంపెనీలు వైద్యులకు ఇచ్చే తాయిలాలకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 37(1) ప్రకారం మినహాయింపు ఉండబోదని స్పష్టం చేసింది. .