నాకు రాజ్యసభ టికెట్ వద్దు
ABN , First Publish Date - 2022-05-29T16:59:27+05:30 IST
కర్ణాటక శాసనసభ్యుల కోటా నుంచి రాజ్యసభ స్థానానికి దాదాపు పేరు ఖరారవుతుందని భావిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

- Bjp రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్కుమార్ సురానా లేఖ
బెంగళూరు: కర్ణాటక శాసనసభ్యుల కోటా నుంచి రాజ్యసభ స్థానానికి దాదాపు పేరు ఖరారవుతుందని భావిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్కుమార్ సురానా మనసు మార్చుకున్నారు. మరో రెండురోజుల్లో నామినేషన్ దాఖలుకు గడువు సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. తనకు రాజ్యసభ టికెట్ వద్దంటూ లేఖలో స్పష్టం చేశారు. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం రాష్ట్ర బీజేపీ కోర్కమిటీ నిర్మల్ కుమార్ సురానా పేరును పరిశీలనలకు పంపింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో సురానాకు టికెట్ వచ్చినట్లేనని అందరూ భావించారు. కానీ సురానా స్వయంగా టికెట్ వద్దని, ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు అదనంగా న్యాయం చేయలేనంటూ లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఏ క్షణంలోనైనా పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.