Independence Day: ఎర్ర కోట వద్ద నో కైట్ ఫ్లై జోన్
ABN , First Publish Date - 2022-08-05T00:41:45+05:30 IST
స్వాతంత్ర్య దినోత్సవాల (Independence Day Celebrations) నిర్వహణకు ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాల (Independence Day Celebrations) నిర్వహణకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగించే ఎర్ర కోట (Red Fort) వద్ద సరికొత్త బృందాలను మోహరిస్తున్నారు. గాలి పటాలు ఎగరని ప్రాంతంగా మార్చబోతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసే సమయంలోనూ, జాతిని ఉద్దేశించి ఎర్ర కోట నుంచి ప్రసంగించేటపుడు గాలి పటాలు పడకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం గాలి పటాలను తరచూ ఎగురవేసే దాదాపు 231 మంది సహకారాన్ని కోరారు. గాలి పటాలను ఎగురవేసే అవకాశం ఉన్న 350 పైకప్పు ప్రాంతాలను గుర్తించారు. వీటిపైన పొడవైన వెదురు కర్రలతో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా గాలి పటాన్ని ఎగురవేస్తే, వెంటనే వీరు ఆ కర్రతో అడ్డుకుంటారు. గాలి పటాల తాళ్ళను తెగ్గోసేందుకు కైట్ ఫ్లయర్స్ సేవలను వినియోగించుకోవాలని మొదట్లో అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదనను ఢిల్లీ పోలీసులు విరమించుకున్నారు.
1000కి పైగా సీసీటీవీ కెమెరాలు
వివిధ ఉగ్రవాద సంస్థల నుంచి స్వాతంత్ర్య దినోత్సవాలకు ముప్పు ఉండటంతో 1,000కిపైగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) ఆధారిత సీసీటీవీ (CCTV) కెమెరాలను ఎర్ర కోట పరిసరాల్లో అమర్చాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో గురువారం హెచ్చరించింది.