Bihar politics: నితీష్ సీఎంగా ఐదేళ్లు పూర్తి చేయలేరన్న చిరాగ్
ABN , First Publish Date - 2022-08-08T20:45:38+05:30 IST
బీహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేరని ..

పాట్నా: బీహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar) ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేరని లోక్ జన్శక్తి పార్టీ -రామ్ విలాస్ (LJP-R) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag paswan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలోనైనా బీహార్లో మధ్యంతర ఎన్నికలు (Mid term polls) జరగవచ్చని ఆయన జోస్యం చెప్పారు.
''ప్రస్తుతం బీహార్లో పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. మహాకూటమి (Mahagath bandhan) నేతలతో చేతులుకలిపి నితీష్ కుమార్ విజయవంతంగా తన పదవిని కాపాడుకోగలిగినా, 2025 వరకూ మాత్రం తన పదవిని కాపాడుకోలేరు. మహాకూటమి నేతలకు అత్యుత్సాహం ఎక్కువ. అది మధ్యంతర ఎన్నికలకు దారితీస్తుంది'' అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బీహార్లోని ఎన్డీయే ప్రభుత్వంలో చీలక రానుందనే ఊహాగానాలతో పాటు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితీష్కుమార్ మంగళవారం కీలక సమవేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా, బీహార్లో అధికార జేడీయూ, బీజేపీ మధ్య పొత్తు తెగిపోనుందని పరిశీలకుల అంచనాగా ఉంది. ఇదే జరిగితే ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రెంట్లతో పొత్తు పొట్టుకోవాలని జేడీయూ చూస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో కేంద్రంతో అంటీముట్టన్నట్టుగా నితీష్ వ్యవహరిస్తుండటం, ప్రధాని ఆదివారం నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొనకపోవడం వంటి పరిణామాలు జేడీయూ-బీజేపీ మధ్య వ్యవహారం చెడిందనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.