Vande Bharat 2: ఈనెల 30 నుంచి పట్టాల పైకి కొత్త రైళ్లు

ABN , First Publish Date - 2022-09-14T00:15:08+05:30 IST

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కొత్త ఫీచర్లతో ఆధునికీకరించిన వందే భారత్ రైళ్లు..

Vande Bharat 2: ఈనెల 30 నుంచి పట్టాల పైకి కొత్త రైళ్లు

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కొత్త ఫీచర్లతో ఆధునికీకరించిన (upgraded) వందే భారత్ రైళ్లు (Vande Bharat trains) 'వందే భారత్ 2' (Vande Bhart 2)ను ఈనెల 30వ తేదీ నుంచి పట్టాల పైకి తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలతో ఈ రైళ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తెస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. 


''కొత్త రైళ్లు సీఆర్ఎస్ క్లియెరెన్స్ పొందాయి. పట్టాల మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 30న అహ్మదాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది'' అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.


కొత్త సౌకర్యాలు...

వందే భారత్ కొత్త రైళ్లు మరింత వేగంగా, తేలికపాటి బరువుతో ఉంటాయి. వై-ఫై కనెక్షన్ ఉంటుంది. కేటలిస్టిక్ ఆల్ట్రా వైలట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎయిర్ ప్రూరిఫికేషన్ కోరం రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ (ఆర్ఎంపీయూ)ను కొత్తగా డిజైన్ చేశారు.


2023 నాటికి 75 వందే భారత్ రైళ్లు

వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైలు పట్టాల మీదకు రాగానే సాధ్యమైనంత త్వరగా తక్కిన 74 వందే భారత్ రైళ్ల తయారీ ప్రక్రియను చేపట్టాలని అనుకుంటోంది. మొదటి రెండు, మూడు నెలల్లో ప్రతినెలా 2 నుంచి 3 రైళ్ల తయారీ చేపట్టి, క్రమంగా నెలకు 6 నుంచి 7కు పెంచాలని ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.

Updated Date - 2022-09-14T00:15:08+05:30 IST