‘మేఘా’పై గడ్కరీ ప్రశంసల జల్లు
ABN , First Publish Date - 2022-03-23T07:09:52+05:30 IST
హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ...
ఆ కంపెనీకి జోజిలా సొరంగం ప్రాజెక్టు
కేటాయింపుతో రూ.5 వేల కోట్లు ఆదా
న్యూఢిల్లీ, మార్చి 22 : హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లోక్సభ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో హిమాలయ శ్రేణుల్లోని సోన్మార్గ్- డ్రాస్ పట్టణాలను అనుసంధానిస్తూ 14.2 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగం పనుల కాంట్రాక్టును ఆ కంపెనీ దక్కించుకుందని చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ సొరంగం నిర్మాణంపై ఏర్పాటుచేసిన వర్క్షా్పకు నార్వేతో పాటు పలు దేశాల నుంచి కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు రూ.12,000 కోట్ల అంచనా వ్యయంతో అవి బిడ్లను దాఖలు చేశాయని పేర్కొన్నారు. వీటన్నింటిని అధిగమించి.. ఒక భారతీయ కంపెనీ (మేఘా ఇంజినీరింగ్) ఈ కాంట్రాక్టును దక్కించుకోవడం గర్వంగా ఉందన్నారు. మేఘాకు ఈ కాంట్రాక్టును కేటాయించడం వల్ల భారత ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్లు ఆదా అవుతాయని తెలిపారు.