13న విచారణకు రండి..Rahul Gandhiకి ఈడీ తాజా సమన్లు
ABN , First Publish Date - 2022-06-03T18:00:07+05:30 IST
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది....
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గురువారం ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరు కావాలని ఈడీ తాజా నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. గురువారం నాటి ఈడీ విచారణకు హాజరుకావడం లేదని రాహుల్ సమాచారం పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భూకబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.ఇదిలా ఉండగా.. ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరుకావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. సోనియాగాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ నెల 8న ఈడీ విచారణకు సోనియా హాజరవుతారతారని సూర్జేవాలా చెప్పారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనున్నట్టు తెలిపింది.