MVA స్పీకర్ అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే Rajan Salvi నామినేషన్

ABN , First Publish Date - 2022-07-02T23:02:03+05:30 IST

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పదవికి మహా వికాస్ అఘాడి అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వి నామినేషన్..

MVA స్పీకర్ అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే Rajan Salvi నామినేషన్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పదవికి  మహా వికాస్ అఘాడి (MVA) అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వి (Rajan Salvi) నామినేషన్ వేశారు. ఈనెల 3వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగనుంది. స్పీకర్ పదవికి బీజేపీ నుంచి రాహుల్ నార్వేకర్ శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ముంబైలోని కొలబా అసెంబ్లీ నియోజకవర్గానికి నార్వేకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రత్నగిరి జిల్లా రాజపూర్ నియోజకవర్గానికి సాల్వి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది.


కాంగ్రెస్ పార్టీకి చెందిన నానా పటోలే గత ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అప్పట్నించి స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. కాగా, విపక్ష పార్టీల అభ్యర్థిగా సాల్వి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ ధోరత్ తెలిపారు. సాల్వి నామినేషన్ సందర్భంగా జయంత్ పాటిల్, ధనంజయ్ ముండే (ఎన్‌సీపీ), అశోక్ చవాన్ (కాంగ్రెస్), సునీల్ ప్రభు (శివసేన) తదితరులు హాజరయ్యారు. ఈనెల 3,4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశవుతోంది. ఆదివారంనాడు స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుడంగా, కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే సోమవారంనాడు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటారు.

Updated Date - 2022-07-02T23:02:03+05:30 IST