ఈడీ కస్టడీకి దావూద్ సోదరుడు
ABN , First Publish Date - 2022-02-19T00:43:32+05:30 IST
అజ్ఞాత నేర ప్రపంచ నేత దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్ను మనీ లాండరింగ్..
ముంబై: అజ్ఞాత నేర ప్రపంచ నేత దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్ను మనీ లాండరింగ్ కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీకి ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది. దీనికి ముందు, దావూద్పైన, ఆయన అనుచరులపైన నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి థానే జైలులో ఉన్న ఇక్బాల్ను ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది.
ఇక్బాల్ తరఫు న్యాయవాది సుల్తాన్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ, దావూద్ సోదరుడు అయినందునే తన క్లయింట్ను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. దావూద్ దేశం విడిచి వెళ్లినప్పటి నుంచి అతనితో ఇక్బాల్కు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇక్బాల్ నెలల తరబడి జైలులో ఉన్నారని అన్నారు. కాగా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంపై ఈడీ గురువారంనాడు దాడులు నిర్వహించింది. మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ దాడులు జరుపగా, వీటిలో 9 ప్రాంతాలు ముంబైలో, ఒకటి థానేలో ఉన్నాయి. ఈ కేసులో పరారీలో ఉన్న అజ్ఞాత నేర ప్రపంచ నేతలు, కొందరు రాజకీయనేతల ప్రమేయంపై ఈడీ విచారణ జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.