డ్యామ్ ఇంజనీర్లకు శాటిలైట్ ఫోన్లు
ABN , First Publish Date - 2022-06-05T16:04:54+05:30 IST
ముల్లై - పెరియార్ డ్యామ్ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాటిలైట్ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర నీటివనరుల
చెన్నై, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ముల్లై - పెరియార్ డ్యామ్ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాటిలైట్ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర నీటివనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.9.50లక్షలతో కొనుగులు చేసిన ఆరు శాటిలైట్ ఫోన్లను ఆ డ్యామ్ వద్ద పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పెరియార్ డ్యామ్ క్యాంపు, తేక్కడి క్యాంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన ముల్లై పెరియార్ డ్యామ్ దట్టమైన పెరియార్ పులుల అభయారణ్యం నడుమ ఉందని, ఆ ప్రాంతంలో ల్యాండ్ లైన్ టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు సక్రమంగా పనిచేయవని, ఈ ఇబ్బందులను గమనించే డ్యాం వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లకు శాటిలైట్ ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు నీటివనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సక్సేనా, చీఫ్ ఇంజనీర్ కే రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.