నెలాఖరుదాకా విద్యాసంస్థలు మూతే
ABN , First Publish Date - 2022-01-13T18:31:07+05:30 IST
కొవిడ్ కేసులు తీవ్రమవుతుండడంతో బెంగళూరు నగర వ్యాప్తంగా నెలాఖరు దాకా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ప్రకటించారు. బుధవారం అన్ని జిల్లాల డీడీపీఐ, బీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్
బెంగళూరు: కొవిడ్ కేసులు తీవ్రమవుతుండడంతో బెంగళూరు నగర వ్యాప్తంగా నెలాఖరు దాకా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ప్రకటించారు. బుధవారం అన్ని జిల్లాల డీడీపీఐ, బీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక మంత్రి బెంగళూరులో విద్యాసంస్థలను నెలాఖరుదాకా మూసివేయాలని తీర్మానించారు. కొవిడ్ కేసుల తీవ్రతను బట్టి తాలూకాలలో విద్యాసంస్థలను మూసివేసే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆన్లైన్ తరగతులు, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై చర్చించామన్నారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లతోనూ మరోసారి సమీక్ష జరపాల్సి ఉందన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులలో చేరేవారు తక్కువగా ఉండడంతో భయపడాల్సిన పనిలేదన్నారు. మొదటి, రెండో విడతలలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ఒమైక్రాన్, థర్డ్వేవ్ ప్రభావం తీవ్రం అనిపించుకోలేదన్నారు. అయినా పిల్లల్లోనూ వైరస్ తీవ్రమవుతుండడంతో భౌతికంగా తరగతులు సమంజసం కాదనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక పాఠశాల లేదా కళాశాలలో ఒక పాజిటివ్ కేసు నమోదైనా విద్యార్థులందరికీ టెస్టింగ్లు చేయాలని తీర్మానించామన్నారు. వెంటనే సంబంధిత పాఠశాలలో ఆఫ్లైన్ క్లాసులు రద్దు చేస్తామన్నారు. కొవిడ్ సురక్షతా చర్యలపై విద్యార్థుల్లోనూ చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా 1-9 తరగతులకు ఆఫ్లైన్ క్లాసులు నెలాఖరుదాకా ఉండవన్నారు. ఆన్లైన్ బోధనలకు అభ్యంతరం లేదన్నారు. ఇక 15-18 ఏళ్లలోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.