Monkeypox: మంకీపాక్స్కు రాష్ట్రంలోనే పరీక్షలు
ABN , First Publish Date - 2022-08-02T12:35:23+05:30 IST
మంకీపాక్స్(Monkeypox) ఆనవాళ్లున్న వారి రక్తపు నమూనాలకు రాష్ట్రంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(Minister M.
- మంత్రి సుబ్రమణ్యం
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 1: మంకీపాక్స్(Monkeypox) ఆనవాళ్లున్న వారి రక్తపు నమూనాలకు రాష్ట్రంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. స్థానిక సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యవృత్తిలో పాల్గొంటున్న వారు తమ నైపుణ్యాలు మెరుగుపరచుకొనేందుకు అనుకూలంగా సోమవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సులో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లోని 15 వైద్యకళాశాలల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, వైద్యనిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రారంభించిన సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రభుత్వ వైద్యకళాశాలలు, ఏడు ప్రైవేటు వైద్యకళాశాలలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్న తలా రెండు వైద్యకళాశాలల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు జాతీయ వైద్య విద్య కౌన్సిల్ సూచనల మేరకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వైద్యశాఖ అధికారులు బసచేసేందుకు రాజీవ్గాంధీ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోనే మూడు గదులను రూ.3.80 లక్షల విలువతో ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చే వారు విశ్రాంతి తీసుకొనేందుకు రెండు గదులు, డైనింగ్ హాలు వసతితో ఒక గదిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్డియాలజిస్ట్ డా.మునుస్వామి విధులకు హాజరుకాకుండానే ప్రతిరోజు అటెండెన్స్లో హాజరైనట్లు తన పేరు నమోదుచేస్తూ వచ్చిన ఉదంతం వెలుగుచూసిందని, ఆయనపై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. వైద్యులు దేవుడితో సమానులని, వైద్యం కోసం తమ వద్దకు వచ్చే రోగులకు అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత ఉందని డా.మునుస్వామిలా అవినీతికి పాల్పడే వారిని ప్రభుత్వం క్షమించదని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో మంకీ పాక్స్ లక్షణాలున్న ఆరుగురి రక్తనమూనాలు పరీక్షించగా, ఫలితాల్లో ఒక్కరి కూడా ఆ ఛాయలు లేవని తెలిసిందన్నారు. రాష్ట్రంలో మంకీపాక్స్(Monkeypox) సోకిన బాధితుల రక్తనమూనాలను పూణెలో ఉన్న ప్రయోగశాలకు పంపించాల్సిన అవసరం ఉండదని, ఇక నుంచి గిండి కింగ్ ఇన్సిస్టిట్యూట్లో ఏర్పాటుచేసిన ప్రయోగశాలలోనే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఆస్పత్రి ప్రాంగణంలో రూ.6.80లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వేరియాన్ని మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు.