ఇరాక్లోని అమెరికా కాన్సలేట్పై ఇరాన్ క్షిపణుల దాడి
ABN , First Publish Date - 2022-03-13T18:01:29+05:30 IST
ఇరాక్ నగరమైన ఏర్బిల్లోని అమెరికా కాన్సలేట్ లక్ష్యంగా ఆదివారంనాడు 12 క్షిపణులు ..
ఏర్బిల్: ఇరాక్ నగరమైన ఏర్బిల్లోని అమెరికా కాన్సలేట్ లక్ష్యంగా ఆదివారంనాడు 12 క్షిపణులు దూసుకువచ్చాయి. పొరుగున ఉన్న ఇరాన్ నుంచే ఈ క్షిపణలు ప్రయోగించినట్టు అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్షిపణి దాడుల్లో ఆస్తి, ప్రాణనష్టంపై ఇరాక్, యూఎస్ అధికారులు భిన్నమైన కథనాలు చెబుతున్నాయి. అమెరికా కాన్సలేట్కు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా అధికారులు చెబుతుండగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యూఎస్ కాన్సలెట్ను పలు క్షిపణులు తాకినట్టు ఇరాక్ అధికారులు తెలిపారు. అమెరికా కాన్సలేట్పై బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించినట్టు వారు తెలిపారు. కాగా, ఇవి ఏ తరహా క్షిపణులనే విషయాన్ని యూఎస్ అధికారులు ధ్రువీకరించలేదు.
మరోవైపు, ఇరాక్లోని తమ కాన్సలేట్పై దాడిని అమెరికా ఖండించింది. ఇది ఇరాక్ సౌరభౌమత్యం, హింసను రెచ్చగొట్టేందుకు జరిపిన దాడిగా పేర్కొంది. దీనిపై ఇరాక్, కుర్దిష్ రీజినల్ గవర్నమెంట్ విచారణ జరుపుతాయని అధికారులు తెలిపారు.