Minister: కౌన్సిలర్లు విధిగా వార్డుల్లోనే ఉండాలి
ABN , First Publish Date - 2022-10-07T16:30:22+05:30 IST
వర్షాకాలం ముగిసేంత వరకు ఆయా వార్డుల్లోనే కౌన్సిలర్లు ఉండాలని రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు(State Minister PK Shekhar Babu) సూచించారు.
- మంత్రి శేఖర్ బాబు
అడయార్(చెన్నై), అక్టోబరు 6: వర్షాకాలం ముగిసేంత వరకు ఆయా వార్డుల్లోనే కౌన్సిలర్లు ఉండాలని రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు(State Minister PK Shekhar Babu) సూచించారు. చెన్నై నగర పాలక సంస్థ పరిధిలోని తిరువిగ నగర్ జోన్ కార్యాలయంలో ఆయన వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నగర మేయర్ ఆర్.ప్రియ(Mayor R. Priya), ఆ జోన్ పరిధిలోని వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ, చెన్నై నగర వ్యాప్తంగా వర్షపునీటి కాలువల నిర్మాణం, విద్యుత్ కేబుల్స్, డ్రైనేజీ కాల్వల తవ్వకం పనులు వంటివి జోరుగా సాగుతున్నాయి. అదేసమయంలో రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభంకానుంది. ఈ సమయంలో నగర వాసులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. ముఖ్యంగా ఆయా వార్డుల కౌన్సిలర్లు విధిగా వార్డుల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాకాలంలో నగర వాసుల మనసు కష్టపడకుండా అధికారులు నడుచుకోవాలని మంత్రి శేఖర్ బాబు కోరారు.