కేంద్రం వాటా రాలేదు.. అందుకే విద్యుత్ కోతలు
ABN , First Publish Date - 2022-04-22T16:01:04+05:30 IST
కేంద్ర వాటాగా రావాల్సిన విద్యుత్ సరఫరా ఆగిపోయిందని అందుకే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయని విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. ఈ

- మంత్రి సెంథిల్ బాలాజి
అడయార్(చెన్నై): కేంద్ర వాటాగా రావాల్సిన విద్యుత్ సరఫరా ఆగిపోయిందని అందుకే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయని విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. ఈ విద్యుత్ కోతలకు గల కారణాలను ఆయన తన ట్విటర్ ఖాతాలో వివరణ ఇచ్చారు. విద్యుత్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 24 గంటల పాటు పనిచేసేలా 94987 94987 అనే హెల్ప్లైన్ నంబరు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నంబరుకు ఫోన్ చేసి ఎలాంటి సమస్యనైనా తెలుపుకోవచ్చన్నారు. బుధవారం సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుంచి సరఫరా కావాల్సిన 750 మెగావాట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు వెల్లడించారు. ఫలితంగా 15 నిమిషాల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో రూ.10 కోట్లతో నెలకొల్పనున్న బిజినెస్ అండ్ ఎక్స్పోర్టు సెంటర్ల నిర్మాణ అధ్యయనం కోసం ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు.