Marina Beach: వర్షాకాలం ముగిసిన తర్వాతే...
ABN , First Publish Date - 2022-12-17T10:17:16+05:30 IST
దివ్యాంగులు సముద్రతీర సమీపంలోకి వెళ్లి అలల అందాలను వీక్షించేలా స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో చెన్నై కార్పొరేషన్ రూ.1 కోటి వ్యయంతో చెక్క వంతెన ఏర్పాటుచేసిన
- మెరీనా చెక్క వంతెనకు అనుమతి
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 16: దివ్యాంగులు సముద్రతీర సమీపంలోకి వెళ్లి అలల అందాలను వీక్షించేలా స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో చెన్నై కార్పొరేషన్ రూ.1 కోటి వ్యయంతో చెక్క వంతెన ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ వంతెనను ప్రస్తుత మంత్రి, ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. దివ్యాంగులు వీల్ ఛైర్పై ఈ వంతెన మీదుగా అలల వద్దకు వెళ్లి ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘మాండస్’ తుఫాను కారణంగా ఈ వంతెన ధ్వంసమైంది. ప్రస్తుతం వంతెనను పునరుద్ధరించిన తరుణంలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్షాకాలం ముగిసిన తర్వాతే వంతెన దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన కార్పొరేషన్, ఆ విషయాన్ని ప్రజలకు తెలిసేలా వంతెన ప్రవేశం వద్ద బ్యానర్ ఏర్పాటుచేసింది.