మణిపూర్ పోలింగ్లో హింస, ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-03-05T21:36:39+05:30 IST
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా శనివారంనాడు హింస..
ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా శనివారంనాడు హింస చెలరేగింది. తౌబల్ జిల్లాలో ఒక ఘటన, సెనాపతి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 47.16 శాతం పోలింగ్ నమోదైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఛందేల్లో 48.95 శాతం, జిరిబామ్లో 49 శాతం, తౌబల్లో 47.48 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో జరగుతున్న పోలింగ్లో 92 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఫిబ్రవరి 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో చౌరచందర్పూర్, కాంగోప్కి, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రీపోలింగ్ నిర్వహించినట్టు సీఈఓ తెలిపారు. మార్చి 10న ఓట్లు లెక్కింపు ఉంటుంది.