Mangaluruలో 518 మంది విదేశీయుల గుర్తింపు
ABN , First Publish Date - 2022-07-05T15:41:43+05:30 IST
రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా 518 మంది విదేశీయులను పోలీసులు

- వారం రోజులుగా పోలీసుల గాలింపు
బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారివద్ద సరైన రికార్డులు లేనట్లుగా గుర్తించారు. నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసించే వ్యక్తులను గుర్తించి వారి రికార్డులను పరిశీలించారు. వీరిలో 518 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని వారికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సోమవారం నగర పోలీసు కమిషనర్ శశికుమార్ మీడియాకు తెలిపారు. మంగళూరు పరిధిలో 18 పోలీసుస్టేషన్లు ఉండగా 4వేల మంది విదేశీయులను గుర్తించామన్నారు. వీరిలో రికార్డులు సక్రమంగా లేనివారు 518 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళూరు రోసారియో హాల్లో వారిని విచారిస్తున్నామన్నారు. వీరిలో కొందరు ఒడిస్సా, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందినవారుగా చెబుతున్నారన్నారు. రికార్డులతో పాటు వారు ఇచ్చిన వివరాలు, మొబైల్ నంబర్లు, గూగుల్ మ్యాప్ ద్వారా చిరునామాలను పరిశీలిస్తున్నామన్నారు. రికార్డులు లేని వారిని గుర్తించేందుకు 20 అంశాలను ప్రాతిపదికగా విచారిస్తున్నట్లు తెలిపారు.