Maha Crisis: ‘మహా’ సంక్షోభంలో సరికొత్త మలుపు.. ఫడణవీస్ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2022-06-29T04:06:44+05:30 IST
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సరికొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలో జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం ముంబైకి చేరుకున్న ఫడణవీస్ కీలక నిర్ణయం దిశగా..

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సరికొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలో జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం ముంబైకి చేరుకున్న ఫడణవీస్ కీలక నిర్ణయం దిశగా అడుగులేశారు. చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహజన్తో పాటు కొందరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఫడణవీస్ రాజ్భవన్కు వెళ్లారు. అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాల్సిందిగా గవర్నర్ను డిమాండ్ చేయాలని మహారాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీలో జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో కూడా ఫడణవీస్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు అమిత్షాతో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే క్యాంపులోని 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపేందుకు గౌహతి నుంచి ముంబైకి వస్తున్నారని ఉద్ధవ్ వర్గంలోని కీలక నేత రాహుల్ పాటిల్ ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుత పరిస్థితులపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాహుల్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం గౌహతిలోని ఓ లగ్జరీ హోటల్లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్లనున్నట్లు షిండే ప్రకటించడం గమనార్హం. తాము శివసేనలోనే ఉన్నామని, శివసేనను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఉన్నామని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని షిండే మీడియాకు తెలిపారు.
త్వరలో తాను ముంబై వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గౌహతిలో తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. త్వరలోనే తాను ముంబై వెళ్లి గవర్నర్ను కలుస్తానని షిండే స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేతో టచ్లో ఉన్నారన్న ప్రచారాన్ని ఏక్నాథ్ షిండే కొట్టిపారేశారు. రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులపై స్పందించేందుకు జులై 12 వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.