మదురై - కాశీల మధ్య ప్రైవేటు రైలు ?
ABN , First Publish Date - 2022-06-16T15:34:34+05:30 IST
మదురై - కాశీ మధ్య ప్రైవేటు రైలు నడిపేందుకు దరఖాస్తు వచ్చిందని, అది పరిశీలనలో ఉందని దక్షిణ రైల్వే జనరల్ మేనేజరు పీజీ మల్లయ్య తెలిపారు.
అడయార్(చెన్నై), జూన్ 15: మదురై - కాశీ మధ్య ప్రైవేటు రైలు నడిపేందుకు దరఖాస్తు వచ్చిందని, అది పరిశీలనలో ఉందని దక్షిణ రైల్వే జనరల్ మేనేజరు పీజీ మల్లయ్య తెలిపారు. ఆయన మదురైలో మీడియాతో మాట్లాడుతూ, భారత్ గౌరవ్ పథకం కింద కోయంబత్తూరు నుంచి షిర్డీకి ప్రైవేటు రైలు సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ఇదేవిధంగా మదురై నుంచి కాశీకి ప్రైవేటు రైలు నడపాలనే విజ్ఞాపన పరిశీలనలో ఉందన్నారు. తేని - బోడినాయకనల్లూరు ప్రాంతాల మధ్య బ్రాడ్ గేజ్ పనులు ఆగస్టుతో పూర్తవుతాయన్నారు. అలాగే, పాంబన్ కొత్త వంతెన నిర్మాణ పనులు వచ్చే యేడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు.