ఖాదీతో మహాత్మునికి నివాళి అర్పిద్దాం: ప్రధాని
ABN , First Publish Date - 2022-10-03T09:15:16+05:30 IST
జాతిపిత గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహాత్మునికి నివాళులర్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
న్యూఢిల్లీ, అక్టోబరు 2: జాతిపిత గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలో రాజ్ఘాట్కు వెళ్లి గాంధీని స్మరించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కర్ణాటకలో మైసూర్ సమీపంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖాదీని ప్రోత్సహించి మహాత్ముడు చెప్పిన మార్గంలో నడుచుకుందామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. లండన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీకి అంజలి ఘటించారు. చైనా రాజధాని బీజింగ్లో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, దేశ రెండో ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్ ఘాట్లో ఆయన సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. సరళత్వానికి, నిరాడంబరతకు శాస్త్రి నిదర్శనమని ప్రధాని అన్నారు.