అమెరికాను తప్పుగా అంచనావేసిన లాడెన్‌

ABN , First Publish Date - 2022-04-26T08:44:07+05:30 IST

అమెరికాలోని జంట టవర్ల మీద దాడి చేసిన తర్వాత ఆ దేశం ఎలా స్పందించవచ్చనే విషయంలో అల్‌ ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అంచనాలు తప్పాయి.

అమెరికాను తప్పుగా అంచనావేసిన లాడెన్‌

9/11 దాడుల తర్వాత యుద్ధాన్ని ఊహించలేదు

యూఎస్‌ నేవీ సీల్స్‌కు లభించిన డాక్యుమెంట్లలో వెల్లడి


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 25: అమెరికాలోని జంట టవర్ల మీద దాడి చేసిన తర్వాత ఆ దేశం ఎలా స్పందించవచ్చనే విషయంలో అల్‌ ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అంచనాలు తప్పాయి. అఫ్ఘానిస్థాన్‌పై అమెరికా యుద్ధానికి దిగుతుందని లాడెన్‌ ఊహించలేదు. దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు వీధులోకి వచ్చి నిరసనలు తెలుపుతారని, అప్ఘానిస్థాన్‌లో అమెరికా జోక్యం చేసుకోకుండా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారని లాడెన్‌ భావించాడు. 2011లో బిన్‌ లాడెన్‌ను హతమార్చిన తర్వాత యూఎస్‌ నేవీ సీల్స్‌ అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వాటి  ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్‌ ఖైదాపై పరిశోధనలు చేసిన ఇస్లామిక్‌ స్కాలర్‌ నెలీ లహోద్‌... సీబీఎస్‌ న్యూస్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. నేవీ సీల్స్‌కు లభించిన డాక్యుమెంట్లను అనుసరించి.. 9/11 దాడుల తర్వాత బిన్‌ లాడెన్‌ అమెరికాపై మరో దాడి చేయడానికి ప్లాన్‌ చేశాడు. ఈసారి ప్యాసింజర్‌ విమానాలు కాకుండా.. వ్యక్తిగత విమానాలను దాడికి ఉపయోగించాలని తన అనుచరులకు చెప్పాడు. ఒకవేళ ఇది కుదరకపోతే... అమెరికాలోని రైల్వే ట్రాక్‌లను 12మీటర్ల మేరకు కట్‌ చేసి భారీ రైలు ప్రమాదాలకు ప్రణాళికలు రూపొందించాడు. 9/11 దాడుల తర్వాత అమెరికాకు తన ఆచూకీ దొరక్కుండా ఉండటం కోసం మూడేళ్లపాటు లాడెన్‌ ఎవరితోనూ మాట్లాడలేదు. 2004లో మళ్లీ ఉగ్రవాదులతో టచ్‌లోకి వచ్చి అమెరికాపై మరో దాడికి ప్లాన్‌ను లేఖల ద్వారా తెలిపాడని సదరు డాక్యుమెంట్లు వెల్లడించాయి.

Updated Date - 2022-04-26T08:44:07+05:30 IST