కొడనాడు కేసులో 220 మంది వద్ద విచారణ
ABN , First Publish Date - 2022-05-01T13:54:57+05:30 IST
నీలగిరిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో దోపిడీ, హత్యకేసుకు సంబంధించి ముద్దాయిలు, సాక్ష్యులని ఇప్పటివరకు 220 మంది
ప్యారీస్(చెన్నై): నీలగిరిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో దోపిడీ, హత్యకేసుకు సంబంధించి ముద్దాయిలు, సాక్ష్యులని ఇప్పటివరకు 220 మంది వద్ద విచారణ జరిపినట్లు కోవై ఐజీ సుధాకర్ తెలిపారు. జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళకు సొంతమైన కొడనాడు ఎస్టేట్లో గత 2017 ఏప్రిల్ 23వ తేదీ రాత్రి ప్రవేశించిన 10 మందితో కూడిన ముఠా సెక్యూరిటీ గార్డ్ ఓంబహదూర్ను హతమార్చి విలువైన వస్తువులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు దోచుకొని పరారైంది. దీనికి సంబంధించి సయాన్, సతీశన్, ఉదయకుమార్, జంషీర్అలి, దీపు, సంతోష్, దిలీప్ జాయ్, మనోజ్ సహా 10 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై సేలం, కోవై, నీలగిరి ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పటివరకు 220 మంది వద్ద విచారణ జరిపాయి. ఈ నేపథ్యంలో, జయలలిత, శశికళల దగ్గర సుదీర్ఘకాలం సహాయకుడిగా పనిచేసిన పూంగుండ్రం వద్ద రెండవ రోజైన శనివారం కోవై పీఆర్ఎస్ మైదానంలోని విచారణ కార్యాలయంలో విచారణ జరిపినట్లు ఐజీ సుధాకర్ తెలిపారు.