విస్తరణకు ఏక్షణంలోనైనా ముహూర్తం ఖరారు..?
ABN , First Publish Date - 2022-05-15T17:18:37+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గవిస్తరణకు ఏ క్షణంలోనైనా ముహర్తం ఖరారు కావచ్చునని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు
బెంగళూరు: రాష్ట్ర మంత్రివర్గవిస్తరణకు ఏ క్షణంలోనైనా ముహర్తం ఖరారు కావచ్చునని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నాయి. శనివారం సీఎం బసవరాజ్ బొమ్మై పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రేస్కోర్స్ రోడ్డులోని నివాసంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, మంత్రి గోవింద కారజోళ, మాజీ మంత్రి లక్ష్మణ్ సవదితో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ పెద్దల సందేశంతో రాష్ట్రానికి అరుణ్సింగ్ రావడంతో ఈ చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం బొమ్మై ఢిల్లీ వెళ్లిన సందర్భంలో మూడు నాలుగు రోజుల్లోనే జాబితాను ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో అరుణ్సింగ్ రాకతో శుభసందేశంతో వచ్చి ఉంటారని పార్టీ వర్గాలు భావించాయి. శుక్రవారం ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత యడియూరప్పతో చర్చించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిశారు. ఇలా వరుసగా ముఖ్యనేతలతో సీఎం భేటీ కావడం వెనుక విస్తరణ అంశాలే ఉంటాయనే చర్చలు సాగాయి. కాగా మైసూరు పర్యటనలో యడియూరప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 17 మందిలో ఎంత మందికి మంత్రి పదవులు కొనసాగుతాయో చెప్పలేనంటూ దాటవేయడం చర్చనీయాంశమయింది.