‘భగవద్గీతతో బైబిల్ను పోల్చవద్దు’
ABN , First Publish Date - 2022-04-29T17:45:03+05:30 IST
కర్ణాటక విద్యాసంస్ధల్లో మత బోధనలకు అవకాశం ఇవ్వబోమని ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్ ప్రకటించారు.

బెంగళూరు: కర్ణాటక విద్యాసంస్ధల్లో మత బోధనలకు అవకాశం ఇవ్వబోమని ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్ ప్రకటించారు. నగరంలో గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ అడ్మిషన్ల సమయంలోనే బైబిల్ చదవడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన చేర్చారన్న కథనాల నేపధ్యంలో సమగ్ర పరిశీలన జరుపుతున్నామన్నారు. ఇప్పటికే క్లారెన్స్ సంస్ధకు నోటీసు జారీ చేయడం జరిగిందన్నారు. కాగా భగవద్గీత పూర్తిగా నైతిక విలువలను ప్రబోధించే గ్రంథమని దీనిని మత గ్రంథమైన బైబిల్తో పోల్చడం సరికాదన్నారు. విద్యాసంస్ధల్లో పాఠ్యాంశంగా భగవద్గీతను ప్రభుత్వమే ప్రవేశపెడుతున్న నేపధ్యంలో బైబిల్ బోధిస్తే తప్పేమిటని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిపై మంత్రి పై విధంగా స్పందించారు. కాగా బైబిల్ బోధనకు సంబంధించి క్లారెన్స్ హైస్కూలు యాజమాన్యం తీరును బాలల హక్కుల జాతీయ కమిషన్ కూడా తప్పుపట్టింది. బైబిల్ పఠనానికి సంబంధించి ఈ పాఠశాల ఉత్తర్వులు రాజ్యాంగంలోని 25వ నిబంధనను ఉల్లంఘించేవిలా ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 25న వెలుగు చూసిన క్లారెన్స్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది.