ఎన్నికల నాటికి మరిన్ని సీడీలు వస్తాయి...
ABN , First Publish Date - 2022-06-30T17:04:45+05:30 IST
2023 శాసనసభ ఎన్నికలనాటికి రాష్ట్రంలో రకరకాల సీడీలు తెరపైకి రానున్నాయని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పేర్కొన్నారు.
- జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం జోస్యం
బెంగళూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 2023 శాసనసభ ఎన్నికలనాటికి రాష్ట్రంలో రకరకాల సీడీలు తెరపైకి రానున్నాయని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పేర్కొన్నారు. బాగల్కోటెలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే బెంగళూరు నార్త్ బీజేపీ ఎంపీ సదానందగౌడతోపాటు 12 మంది మంత్రులు తమపై ఎలాంటి సీడీలను ప్రసారం చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతిని గుర్తు చేశారు. ఈ స్టే తొలగిన తక్షణం అసలు నాటకం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. కర్ణాటకలో గతంలో ఆపరేషన్ కమల ద్వారా ఒక్కో ఎమ్మెల్యే రూ.30కోట్లకు అమ్ముడుపోయాడని, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే జరిగిందన్నారు. ఆపరేషన్ కమల పేరిట ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మెజారిటీ ప్రభుత్వాలను కూలదోయడం కంటే ఏకంగా వేలంపాటలో పాడుకుంటే మంచిదని చురకలంటించారు. బీజేపీతీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు.