Congress leader Jaiveer Shergill resigns: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో కీలక నేత

ABN , First Publish Date - 2022-08-24T22:26:30+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

Congress leader Jaiveer Shergill resigns: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో కీలక నేత

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదని రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశానని, తాను పార్టీ నుంచి తీసుకున్నదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి అందలాలు దక్కుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సమయం కోరుతున్నా తనను కార్యాలయానికి పిలవలేదని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోందని జైవీర్ షెర్గిల్ చెప్పారు. 



జాతీయ మీడియాలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అధికార ప్రతినిధిగా పార్టీ అభిప్రాయాలను బలంగా వినిపించే నేతగా పేరున్న జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ మంచిపేరు తెచ్చుకున్న షెర్గిల్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  జైవీర్ షెర్గిల్ ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టం కాలేదు.  





జ్యోతిరాదిత్య  సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ తదితరులు వరుసగా పార్టీని వీడటం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. 

Updated Date - 2022-08-24T22:26:30+05:30 IST