ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లాకు బాంబే హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-03-05T07:09:23+05:30 IST
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లాను మార్చి 25 వరకు అరెస్టు చేయవద్దని బాంబే హైకోర్టు పుణె పోలీసులను ఆదేశించింది....
మార్చి 25 వరకు అరెస్టు చేయొద్దన్న న్యాయస్థానం
ముంబై, మార్చి 4: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లాను మార్చి 25 వరకు అరెస్టు చేయవద్దని బాంబే హైకోర్టు పుణె పోలీసులను ఆదేశించింది. రష్మీ శుక్లా ప్రస్తుతం హైదరాబాద్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో బాధ్యతాయుత హోదాలో ఉన్నారని, పారిపోయే అవకాశం ఎక్కడుందని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. రష్మీ శుక్లా 2015-19 మధ్య పుణె పోలీస్ కమిషనర్గా ఉన్న కాలంలో కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పుణె పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. దీనికి వ్యతిరేకంగా రష్మీ శుక్లా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రష్మీ శుక్లాకు అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దని కోరారు. హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదావేసింది.