Hemant Soren: కేసీఆర్‌ బాటలో సోరెన్‌!

ABN , First Publish Date - 2022-11-17T04:09:32+05:30 IST

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చ(జేఎంఎం) చీఫ్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాటలో పయనిస్తున్నారు. కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.

 Hemant Soren: కేసీఆర్‌ బాటలో  సోరెన్‌!

కేంద్రంపై పోరాటానికి సిద్ధం

మిత్రపక్షం ఎమ్మెల్యేలతో సుదీర్ఘ భేటీ

జేఎంఎంలో బీజేపీ ఎమ్మెల్యే చేరిక

రాంచీ, నవంబరు 16: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చ(జేఎంఎం) చీఫ్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాటలో పయనిస్తున్నారు. కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన రూ.వెయ్యికోట్ల కుంభకోణంలో.. మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణకు హాజరవ్వడానికి ఒక్కరోజు ముందు బుధవారం ఆయన వరుస భేటీలు నిర్వహించారు. అదే సమయంలో జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా తమ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించింది. సాయంత్రం ప్రగతిశీల ఐక్య కూటమి(యూపీఏ) మిత్రపక్షాలతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జేఎంఎంతోపాటు కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీల శాసనసభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం మిలాన్‌ సమారో్‌హ’లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే జై ప్రకాశ్‌ వర్మ సోరెన్‌ సమక్షంలో జేఎంఎం కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల తర్వాత 2000 సంవత్సరంలో ఏర్పడ్డ రాష్ట్రాన్ని బీజేపీ ఎక్కువకాలం పాలించిందని.. అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘కుట్రలు చేసే ప్రభుత్వం(బీజేపీ) కావాలా? ఆదివాసీ, మూలవాసి(ఝార్ఖండ్‌లోని గిరిజనేతర స్థానికులు) సర్కారు కావాలా? అనేది ప్రజలే నిర్ణయించాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌ వర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న హేమంత్‌ సోరెన్‌పై బీజేపీ కక్షగట్టి.. వేధింపులకు గురిచేస్తోందని.. దానికి వ్యతిరేకంగానే తాను జేఎంఎంలో చేరానని చెప్పారు. కాగా.. అక్రమ మైనింగ్‌ కేసులో ఈ నెల 3న విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ గత నెలలోనే సమన్లు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని సోరెన్‌ కోరగా.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Updated Date - 2022-11-17T04:09:33+05:30 IST