CM review: ‘గ్రామవన్’ పరిధిలోకి మరిన్ని సేవలు
ABN , First Publish Date - 2022-08-18T17:35:40+05:30 IST
గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా వీటిని మరింత బలోపేతం చేయా
- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
బెంగళూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా వీటిని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తన అధికార నివాసం కృష్ణలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) బుధవారం సిబ్బంది, పాలనా సంస్కరణల శాఖ ప్రగతిని సమీక్షించారు. ఇ-పాలనా శాఖ ప్రగతిని కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన గ్రామవన్(Gramavan) కేంద్రాలలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలు చిన్నచిన్న అవసరాలకోసం తాలూకా, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. మైక్రో బ్యాంకింగ్, ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ వంటి సేవలను కూడా గ్రామవన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 7,274 గ్రామవన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని వీటి ద్వారా గ్రామాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారన్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో రూ.25కోట్ల ఖర్చుతో డ్రోన్ శిక్షణా పాఠశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తక్షణం నగదు బదిలీ జరిగేలా సాంకేతికతను మెరుగు పరచాలని కూడా సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.