గవర్నర్ను రీకాల్ చేయాల్సిందే
ABN , First Publish Date - 2022-04-05T13:19:40+05:30 IST
నీట్ వ్యవహారం జార్జ్కోటకు-రాజ్భవన్కు మధ్య మరింత దూరం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలుపకుండా, నీట్
- లోక్సభలో డీఎంకే ఎంపీల పట్టు
- రెండుసార్లు వాకౌట్
చెన్నై: నీట్ వ్యవహారం జార్జ్కోటకు-రాజ్భవన్కు మధ్య మరింత దూరం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలుపకుండా, నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ లో సోమవారం ఉదయం డీఎంకే ఎంపీలు రెండుసార్లు వాకౌట్ చేశారు. గవర్నర్ను తొలగించాలంటూ సభలో బిగ్గరగా నినాదాలు చేశారు. గవర్నర్ తీరుపై సభలో చర్చ జరపాలని కోరుతూ డీఎంకే సభా పక్షనాయకుడు టీఆర్ బాలు సావధాన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ మేరకు లోక్సభ కార్యదర్శికి రెండు రోజులకు ముందే నోటీసు కూడా అందజేశారు. అందులో గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగం 200 సెక్షన్ ప్రకారం తన విధులను నిర్వర్తించడం లేదని, శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడం లేదని, మూడు ప్రత్యేక బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదని ఆరోపించారు. ఈ నోటీసు నకళ్లను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు, హోం మంత్రి అమిత్షాకు కూడా పంపారు. సోమవారం ఉదయం లోక్సభ సమావేశం కాగానే డీఎంకే సభ్యులంతా లేచి రాష్ట్ర గవర్నర్పై చర్చ జరిపేందుకు తామిచ్చిన సావధాన తీర్మానాన్ని అనుమతించాలని పట్టుబట్టారు. ఆ తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో డీఎంకే ఎంపీలంతా గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. తరువాత ప్రశ్నోత్తరాల సమయం లో డీఎంకే ఎంపీలంతా సభకు వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సావధాన తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతిస్తారని ఎదురూ చూశారు. కానీ సభలో మరో అంశంపై చర్చ ప్రారంభం కావటంతో మళ్ళీ డీఎంకే ఎంపీలు గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు.
అయితే గవర్నర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రాజ్భవన్కు వచ్చిన అతిథులతో సమావేశమవుతూ, వివిధ కార్యక్రమాల్గొ పాల్గొంటూ కాలం గడిపారు.