Sonail Phogat Case: అవసరమైతే సీబీఐకి అప్పగిస్తాం: సీఎం
ABN , First Publish Date - 2022-08-28T20:43:37+05:30 IST
నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసును అవసరమైతే సీబీఐకి అప్పగించేందుకు..
పనజి: నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ (Sonali Phogat) మృతి కేసును అవసరమైతే సీబీఐ (CBI)కి అప్పగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోవా మఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) చెప్పారు. ఈ నెల 23న నార్త్ గోవాలో సోనాలి ఫోగట్ ఆకస్మిక మృతి చెందారు. ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రాథమిక విచారణలో పేర్కొన్న గోవా పోలీసులు ఆ తర్వాత పోస్ట్మార్టం నివేదక ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు.
కాగా, ఫోగట్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు హర్యానా సీఎం తనకు తెలియజేశారని ప్రమోద్ సావంత్ చెప్పారు. ''ఇందులో ఎలాంటి ఇబ్బందీ లేదు. లాంఛనాలన్నీ ఇవాళ పూర్తయిన తర్వాత, అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం'' అని సావంత్ తెలిపారు. ఈ కేసుపై గోవా పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఫోగత్ సన్నిహితులు ఇద్దరు ఉన్నారు. వీరిపై హత్యారోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరు పోలీస్ కస్టడీకి పంపారు. కాగా, ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన..గోవా కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూనెస్, డ్రగ్ డీలర్లు దత్తప్రసాద్ గోయెంకర్, రమాంకాంత్ మండ్రేకర్లను పనజి కోర్టు ముందు శనివారంనాడు హాజరు పరచగా వారిని ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించారు.