Chennai: భాషోద్యమంలో తొలి అడుగు ‘గిడుగు’దే

ABN , First Publish Date - 2022-08-30T15:47:07+05:30 IST

వ్యవహారిక భాషోద్యమకారుడు గిడుగు వేంకటరామ్మూర్తి పంతులు తెలుగు భాషోద్యమానికి నాంది పలికిన మహనీయుడని, భాషోద్యమంలో తొలి అడుగు

Chennai: భాషోద్యమంలో తొలి అడుగు ‘గిడుగు’దే

                                    - భాషా దినోత్సవ సభలో వక్తల నివాళి


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 29: వ్యవహారిక భాషోద్యమకారుడు గిడుగు వేంకటరామ్మూర్తి పంతులు తెలుగు భాషోద్యమానికి నాంది పలికిన మహనీయుడని, భాషోద్యమంలో తొలి అడుగు ఆయనదేనని వక్తలు కొనియాడారు. 90 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి(Gidugu Rammurthy) జయంతి సందర్భంగా సోమవారం ‘తెలుగు భాషా దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించిన ఈ సభ ఎస్‌.శశికళ బృందం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ....’ ప్రార్థనాగీతంతో మొదలైంది. డా.పాండురంగం కాళియప్ప స్వాగతం పలుకగా, ముఖ్యఅతిథిగా ఐకేఎం టెక్నాలజీస్‌ చెన్నై సంస్థ డైరెక్టర్‌ శోభారాజా(Sobharaja), ప్రత్యేక అతిథిగా జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, ఆత్మీయ అతిథులుగా ఆచార్య ఎల్బీ శంకరరావు, డా.ఏవీ శివకుమారి హాజరుకాగా, రాజధాని కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు డా.మామిడి మురళి తదితరులు గిడుగు సేవలపై ప్రసంగించారు. ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి అతిథులు, నిర్వాహకులతో కలసి సభాధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సామాన్య ప్రజానీకానికి సరళమైన రీతిలో భాషను ప్రవేశపెట్టిన గిడుగు రామ్మూర్తి(Gidugu Rammurthy) సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు జరుపుకొంటున్నారన్నారు. ఇలాంటి సభల్లో విద్యార్థులకు ఆ మహనీయుని భాషా సేవ గురించి తెలియజేయడం సంతృప్తిగా ఉందన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మాతృభాష అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని, మాతృభాష ప్రేమికుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయగలుగుతున్నామని శంకరరావు వల్లడించారు. రాజధాని కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా.అంబ్రూణి, డా.అముక్త మాల్యద, డా.ఎలిజబెత్‌ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం డా.మాడా శంకరబాబు వందన సమర్పణతో ముగిసింది.

Updated Date - 2022-08-30T15:47:07+05:30 IST