ఈవీ స్కూటర్ల ప్రమాదాలపై గడ్కరీ వార్నింగ్
ABN , First Publish Date - 2022-04-22T02:46:37+05:30 IST
గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక దుర్ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడడం అత్యంత దురదృష్టకరం. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించబడుతుంది..

న్యూఢిల్లీ: ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రతపై మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఆ జాగ్రత్తలు చూసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎలాంటి లోపాలున్నా సవరించుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తే కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది గడ్కరీ హెచ్చరించారు.
గురువారం ఈ విషయమై తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక దుర్ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడడం అత్యంత దురదృష్టకరం. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించబడుతుంది. అన్ని ఎలాంటి లోపాలున్నా వాహనాలను రీకాల్ చేయబడతాయి. ప్రభుత్వం చర్యలకు దిగే ముందే కంపెనీలే ఈ పని ప్రారంభిస్తే బాగుంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి ప్రయాణీకునికి భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.