మోదీజీ.. లౌడ్స్పీకర్లపై జాతీయ పాలసీ తెండి: శివసేన
ABN , First Publish Date - 2022-04-20T23:03:44+05:30 IST
లౌడ్స్పీకర్ల వినియోగంపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని, ముందుగా దానిని బీజేపీ పాలిత ప్రాంతాల్లో..

ముంబై: లౌడ్స్పీకర్ల వినియోగంపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని, ముందుగా దానిని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలోని మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ ఎంఎన్ఎస్ నేత రాజ్థాకర్ ఇటీవల డిమాండ్ చేయడంతో ఆ అంశం హాట్ టాపిక్ అయింది. దీనిపై బుధవారంనాడిక్కడ మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, లౌడ్స్పీకర్ల వినియోగంపై జాతీయ పాలసీని తీసుకువచ్చి, మొదట బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిందిగా ప్రధాని మోదీకి తమ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. చట్టాలకు కట్టుబడే మహారాష్ట్ర సైతం దాని అమలుకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.
''లాడ్స్పీకర్ల వినియోగంపై మీ వాళ్లు వివాదం లేవనెత్తారు. అందువల్ల దీనిపై ఒక జాతీయ విధానం అనేది అవసరం'' అని బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకుండా రౌత్ వ్యాఖ్యానించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఇంతవరకూ లౌడ్స్పీకర్లు తొలగించలేదని గుర్తు చేశారు. పశువధను నిషేధిస్తూ ఒక పాలసీని కేంద్రం తీసుకువచ్చిందని, ఈశాన్య రాష్ట్రాలు, గోవాను మినహాయించిందని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించడమే దీనికి (మినహాయింపు) కారణమని అన్నారు. అప్పుడు జాతీయ విధానం ఏమైనట్టు? అని రౌత్ ప్రశ్నించారు. ''మీకు ధైర్యం ఉంటే లౌడ్స్పీకర్లపై ఒక జాతీయ విధానం తీసుకువచ్చి, కఠినంగా అమలు చేయండి'' అని ఆయన డిమాండ్ చేశారు.