గువాహటిలో Shivasena రెబెల్ ఎమ్మెల్యేల హోటల్ బిల్లు ఎంతో తెలుసా...
ABN , First Publish Date - 2022-07-02T02:54:43+05:30 IST
సీఎంగా ఎక్నాథ్ షిండే గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి శుభంకార్డ్ పడిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేన
గువాహటి : సీఎంగా ఎక్నాథ్ షిండే(EKnath Shinde) గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి(Maharastra Political Crisis) శుభంకార్డ్ పడిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ(MVA) ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేన(Shivasena) రెబల్ ఎమ్మెల్యేలు(MLAs) విజయవంతమయ్యారు. ముంబైకి 2700 కిలోమీటర్ల దూరంలోని గువాహటి(Guwahati)లోని రాడిసన్ బ్లూ హోటల్(Radison Blue Hotel)ని వేదికగా మార్చుకుని అనుకున్నది సాధించారు. హోటల్లో 8 రోజులపాటు బస చేసినందుకుగానూ రెబల్ ఎమ్మెల్యేలు ఏకంగా రూ.70 లక్షల మొత్తం బిల్లు చెల్లించారని సమాచారం. గువాహటిలోని గోటానగర్కు సమీపంలోని జలుక్బరీలో రాడీసన్ బ్లూ హోటల్ ఉంది. ఎమ్మెల్యేల బసకు బిల్లు ఎంతైంతని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా ఎవరూ నోరువిప్పలేదు. అయితే రూ.68-70 లక్షల వరకు బిల్లు అయ్యి ఉంటుందని హోటల్ వర్గాలు పేర్కొన్నాయి. హోటల్లోని వేర్వేరు అంతస్థుల్లో మొత్తం 70 రూమ్లను ఎమ్మెల్యేలు బుక్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలతోపాటు వారి సహాయకులు కూడా బస చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్నందున జూన్ 22 - జూన్ 29 మధ్యకాలంలో హోటల్ రెస్టారెంట్లు, నాన్-రెసిడెంట్లకు విందులు, ఇతర సౌకర్యాలను నిలిపివేసినట్టు హోటల్ సిబ్బంది చెప్పారు.
మహారాష్ట్ర ఎమ్మెల్యేలు సాధారణ అతిథుల మాదిరిగా బస చేశారు. హోటల్ నుంచి వెళ్లిపోయే ముందు బిల్లులు చెల్లించారు. పెండింగ్లు ఏమీ లేవని హోటల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎంత చెల్లించారనే విషయాన్ని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సుపీరియర్, డీలక్స్ కేటగిరీ రూమ్లలో ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. రాడీసన్ బ్లూ హోటల్ వెబ్సైట్ ప్రకారం.. వేర్వేరు రూమ్లపై టారిఫ్లు ప్రతిరోజూ మారుతుంటాయి. సాధారణంగా సుపీరియర్ రూమ్ల రెంట్ రోజుకు రూ.7500, డీలక్స్ రూంలకు రూ.8500గా ఉంటాయి. జీఎస్టీతో కలిపి ఒక వ్యక్తి ఒక రాత్రి బసకు సుపీరియర్ రూమ్కి రూ.7280, డీలక్స్ రూమ్కి రూ.8400 బిల్లు పడుతుంది. ఈ లెక్కన డిస్కౌంట్లు, ట్యాక్సులు మినహాయిస్తే ఎమ్మెల్యేలకు సుమారు రూ.68 లక్షల బిల్లు అయ్యి ఉంటుందని హోటల్ వర్గాలు అంచనా వేశాయి. కాగా రెబల్ ఎమ్మెల్యే ఫుడ్ బిల్లు రూ.22 లక్షల వరకు అయ్యుంటుందని సమాచారం. రూమ్ రెంట్తో వర్తించే అనుబంధ సర్వీసులను మాత్రమే వారు ఉపయోగించుకున్నారు. స్పా వంటి ఇతర చార్జిబుల్ సర్వీసులేమీ ఎమ్మెల్యేలు వినియోగించుకోలేదని సిబ్బంది వెల్లడించారు.