Relief: ఈపీఎస్కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-08-04T15:26:19+05:30 IST
రహదారి టెండర్ల అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami)కి సుప్రీంకోర్టు

- రూ.4800 కోట్ల టెండర్ల అవినీతి కేసులో సీబీఐ విచారణకు నో
- ఏసీబీ విచారణకు అనుమతి
- నివేదిక పరిశీలించి హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం
చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రహదారి టెండర్ల అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. 2018లో ఈపీఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రహదారి టెండర్ల కేటాయింపుల్లో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడడంతో రూ.4800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డీఎంకే నేత ఆర్ఎస్ భారతి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ(CBI) విచారణకు అనుమతిచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈపీఎస్ సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్ళారు. ఆ అప్పీలు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈపీఎస్పై సీబీఐ విచారణ జరపకుండా స్టే విధించింది. నాలుగేళ్లుగా ఆ అప్పీలు పిటిషన్ విచారణకు నోచుకోలేదు. ఇటీవల డీఎంకే నేత ఆర్ఎస్ భారతి తరఫు న్యాయవాది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఆగస్టు రెండు నుంచి విచారణ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఆ మేరకు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైనప్పుడు పిటిషనర్ ఆర్ఎస్ భారతి తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరై రహదారి టెండర్ల అవినీతి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారణపై విధించిన స్టే తొలగించాలని కోరారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ మేరకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎదుట మళ్ళీ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ అవినీతి కేసుపై సీబీఐ విచారణ మాత్రమే విచారణ జరపాలని కోరుకుంటున్నారా అని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి తరఫు న్యాయవాది కపిల్సిబల్ను ప్రశ్నించగా, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపితే చాలని కపిల్సిబల్ బదులిచ్చారు. అనంతరం ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు(High Court) ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) జరిపిన విచారణ నివేదికను హైకోర్టు సీల్డు కవర్లో స్వీకరించి, దానిని నిశితంగా పరిశీలించిన తర్వాత ఏ సంస్థ ద్వారా విచారణ జరపాలనే విషయమై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఈపీఎస్పై అవినీతి అక్రమాల కేసు విచారణ మళ్ళీ హైకోర్టు చేపట్టనుంది.