ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-04T14:18:24+05:30 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కుటుంబంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రయోగించింది....
చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కుటుంబంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రయోగించింది.2018 అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన తర్వాత గురువారం అర్దరాత్రి అతన్ని అరెస్టు చేసింది.2018 అక్రమ ఇసుక మైనింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది.పంజాబ్లో అక్రమ ఇసుక మైనింగ్ కార్యకలాపాలపై మనీలాండరింగ్ నిరోధక విచారణలో జనవరి 19న నిర్వహించిన దాడుల్లో ఈడీ రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
భూపీందర్ సింగ్కు సంబంధించిన స్థలాల నుంచి రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు.రాష్ట్రంలో అక్రమ ఇసుక మైనింగ్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, వ్యక్తులపై పోలీసు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చర్యలు ప్రారంభించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.కాగా పంజాబ్ ఎన్నికలకు ముందు ఈ కేసులో తనను ఇరికించడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని చన్నీ ఆరోపించారు.