ముంబైలో రూ.538 కోట్ల డ్రగ్స్ దహనం
ABN , First Publish Date - 2022-12-31T05:02:08+05:30 IST
ముంబయి నగరంలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను శుక్రవారం కస్టమ్స్ అధికారులు దహనం చేశారు.
ముంబయి, డిసెంబరు 30: ముంబయి నగరంలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను శుక్రవారం కస్టమ్స్ అధికారులు దహనం చేశారు. రూ.538 కోట్లు విలువ చేసే 140.57 కిలోల హెరాయిన్ తదితర డ్రగ్స్ను ధ్వంసం చేశారు. తలోజాలో ముంబయి వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న దహన యంత్రంలో వాటిని వేసి బూడిద చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ రూపాల్లో అతి రహస్యంగా తీసుకువస్తున్న డ్రగ్స్ను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జాగిలాల సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.