ఫొటోపై రాద్ధాంతమా?
ABN , First Publish Date - 2022-07-05T07:46:58+05:30 IST
కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రాల మీద తన ఫొటో ప్రచురించడంపై వచ్చిన విమర్శలపై ప్రధాని మోదీ స్పందించారు.

కొవిడ్ టీకా సర్టిఫికెట్లపై తన ఫొటో.. విమర్శించిన వారిపై మోదీ చురక
గాంధీనగర్, జూలై 4: కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రాల మీద తన ఫొటో ప్రచురించడంపై వచ్చిన విమర్శలపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచమంతా భారత్ నిర్వహించిన అతి పెద్ద టీకా కార్యక్రమం చూసి ఆశ్చర్యపోతే.. కొంతమంది మాత్రం టీకా ధ్రువీకరణపత్రాల మీద ముద్రించిన తన ఫొటోపైనే దృష్టి సారించారని ప్రధాని మోదీ విమర్శించారు. గుజరాత్లోని గాంధీనగర్లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ని ప్రారంభించిన ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. యూపీఐ వంటి ఆన్లైన్ చెల్లింపుల విధానాలను తమ ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కూడా కొందరు విమర్శించారంటూ.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కొవిడ్ సమయంలో ఎంతగానో ఉపయోగపడిందని.. దానివల్లే ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ టీకా కార్యక్రమాన్ని, ఇతర సహాయకార్యక్రమాలను అమలు చేయగలిగామని ప్రధాని వివరించారు. ‘ఒక దేశం - ఒకే రేషన్ కార్డు’ ద్వారా 80 కోట్ల మంది దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ అందించగలిగామన్నారు. ఇతరదేశాల్లో ప్రజలు టీకా ధ్రువీకరణ పత్రాలు పొందడానికే కష్టపడుతుంటే, మనదేశంలో టీకా వేయించుకున్నవారి మొబైల్ఫోన్కు వెంటనే సర్టిఫికెట్ వచ్చేస్తోందని గుర్తుచేశారు. ఇక.. తాము తెచ్చిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు సైతం వాడుకుంటున్నారని, బిహార్లో ఒక యాచకుడు సైతం క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో తగిలించుకుని బిచ్చమెత్తుకుంటున్నాడని అన్నారు. కానీ, యూపీఐపై ఒక మాజీ ఆర్థిక మంత్రి చాలా ప్రశ్నలు లేవనెత్తారని చిదంబరం పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ఆయన బాగా చదువుకున్నవారని.. అలాంటివారితో సమస్య ఏంటంటే వారు పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తారని ఎద్దేవా చేశారు.