Bakrid సందర్భంగా పశువులను బలి ఇవ్వకండి...Karnataka మంత్రి హెచ్చరిక
ABN , First Publish Date - 2022-07-07T13:49:44+05:30 IST
బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ సంచలన హెచ్చరిక జారీ చేశారు....
బెంగళూరు(కర్ణాటక): బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ సంచలన హెచ్చరిక జారీ చేశారు.‘‘బక్రీద్ పండుగ కోసం పశువులను బలి ఇవ్వకండి’’ అని కర్ణాటక మంత్రి ప్రభు విజ్ఞప్తి చేశారు. పశువులను బలి ఇచ్చే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేధం పటిష్ఠంగా అమలవుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ గోవులను వధించకుండా చూడాలని ఇప్పటికే పోలీసు శాఖ, జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.ఆవులు, గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, వాటిపై డేగ కన్ను వేసి గోహత్యలను నిరోధించడంలో చురుగ్గా వ్యవహరించాలని పశుసంవర్థక శాఖ, పోలీసు శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
సాధారణంగా బక్రీద్ పండుగ సందర్భంగా ఆవు, ఎద్దు, దూడ, ఒంటెల వంటి పశువులను కూడా బలి ఇచ్చే సంప్రదాయం ఉందని చవాన్ తెలిపారు.‘‘కర్ణాటక రాష్ట్రంలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి గోహత్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవాలి. గోహత్య జరిగినట్లు తేలితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చవాన్ అన్నారు.బెంగళూరు నగర జిల్లాలో బక్రీద్ సందర్భంగా గోహత్యలను నిరోధించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే జోన్, నగరం జిల్లాలోని తాలూకాలలో టాస్క్ఫోర్స్ను నియమించారు.