మమతకు ఛాన్సలర్ బిల్లుపై గవర్నర్ ధన్‌కర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-06-23T00:57:14+05:30 IST

వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు-2022ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంపై గవర్నర్ ..

మమతకు ఛాన్సలర్ బిల్లుపై గవర్నర్ ధన్‌కర్ ఏమన్నారంటే..

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు-2022ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంపై గవర్నర్ జగదీప్ ధన్‌కర్ (Jagdeep Dhankar) స్పందించారు. ఆ బిల్లులు తన వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా పరిశీలిస్తానని రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుతో ఇంతవరకూ ఛాన్స్‌లర్‌గా ఉంటున్న గవర్నర్ స్థానే సీఎం ఛాన్స్‌లర్ అయ్యే అవకాశం ఉంటుంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి, గవర్నర్‌ ధన్‌కర్‌కు మధ్య చాలాకాలంగా సరైన సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీల చాన్సలర్‌ పగ్గాలను గవర్నర్ నుంచి సీఎంకు బదలాయించే బిల్లును అసెంబ్లీ ఆమోదించడం మరోసారి చర్చనీయాంశమైంది.


కాగా, రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల్లో అవకతవకలు ఉన్నట్టు కోల్‌కతా హైకోర్టు మందలించిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీ ముందుకు ఈ బిల్లు తెచ్చారని ధన్‌కర్ అన్నారు. అయినప్పటికీ బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి కోపం కానీ, పక్షపాతం కానీ  లేకుండా పరిశీలిస్తానని చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, సుప్రీకోర్టు నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. వంద శాతం చట్టంప్రకారమే తాను నడుచుకుంటానని, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా బిల్లుల పరిశీలన ఉంటుందన్నారు. విద్య అనే అంశం ఉమ్మడి జాబితాలోకి వస్తుందని ఆయన చెప్పారు.

Updated Date - 2022-06-23T00:57:14+05:30 IST