పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం
ABN , First Publish Date - 2022-01-16T19:49:27+05:30 IST
పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఒకరు ఆదివారంనాడు..
లక్నో: పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఒకరు ఆదివారంనాడు లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అటువైపు వెళ్తున్న కొందరితో పాటు పోలీసులు అతన్ని సకాలంలో అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అలీగఢ్కు చెందిన ఆదిత్య ఠాకూర్ ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. విక్రమాదిత్య మార్గ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంచుకునే ప్రయత్నం చేశాడు.
''ఏమైనా కానీయండి. ఇక్కడే ప్రాణాలు తీసుకుంటా. నన్ను జైల్లో పెట్టినా సరే ఎవరూ ఆపలేరు. ఐదేళ్లుగా నా నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలి'' అని ఆదిత్య ఠాకూర్ మీడియా ముందు భావోద్వాగానికి గురయ్యాడు. తనను కాదని బయట వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని, తనకు ఎలాంటి నేరచరిత్ర లేనప్పటికీ టిక్కెట్ నిరాకరించారని అతను వాపోయాడు.