Dark times in Bihar: సీఎం, డిప్యూటీకు చేదు అనుభవం
ABN , First Publish Date - 2022-09-02T21:43:14+05:30 IST
బిహార్లో చిమ్మచీకట్లు ముసురుకుంటున్నాయా? పవర్ కట్ గుప్పిట్లోకి రాష్ట్రం వెళ్తోందా అనే అనుమానాలకు తావిచ్చే ..
పాట్నా: బిహార్లో చిమ్మచీకట్లు ముసురుకుంటున్నాయా? పవర్ కట్ గుప్పిట్లోకి రాష్ట్రం వెళ్తోందా అనే అనుమానాలకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమానికే 'పవర్ కట్' సమస్య ఎదురైంది. పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పరిస్థితి ఉంది. చీకట్లోనే అధికారులు వారికి స్వాగతం పలకడం, ఇరువురూ వేదికపైకి చేరుకోవడం చకచకా జరిగిపోయాయి.
వేదికపై ఉన్న నితీష్ అక్కడే విధుల్లో ఉన్న డీఎంను పవర్ కట్పై ప్రశ్నించారు. అప్పటికే అప్రమత్తమైన సీఎంఏ అధికారులు తమ మొబైల్ లైట్స్ ఆన్ చేసి హడావిడి పడటం కనిపించింది. ఎట్టకేలకు 10 నిమిషాల తర్వాత అధికారులు విద్యుత్ను పునరుద్ధరించారు. ఆ వెంటనే ప్రోగ్రాం మొదలైంది. ఈ వ్యవహారం మొత్తం వీడియోలో రికార్డు కావడం, సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.