మళ్లీ Covid కలకలం !
ABN , First Publish Date - 2022-04-22T13:19:26+05:30 IST
రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం బయల్దేరింది. చెన్నై విమానాశ్రయంలో బుధవారం నలుగురు ప్రయాణికులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలో మాస్కు తప్పనిసరి చేస్తూ
- చెన్నై ఐఐటీలో 12 మందికి పాజిటివ్
- విమానాశ్రయంలో మాస్కు తప్పనిసరి
- ‘ఇలాగైతే ఢిల్లీ పరిస్థితి తప్పదు’ : డాక్టర్ జె.రాధాకృష్ణన్
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం బయల్దేరింది. చెన్నై విమానాశ్రయంలో బుధవారం నలుగురు ప్రయాణికులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలో మాస్కు తప్పనిసరి చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం గిండిలోని మద్రాస్ ఐఐటీలో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొద్ది నెలలుగా కరోనా నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరి మాస్క్ నిబంధన కూడా ఉపసంహరించుకుంది. ఈ నేపధ్యంలో, ప్రపంచంలోని పలు దేశాల సహా దేశంలోని వివిధ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 10వ తేది వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10లోపుగా ఉండగా, 11వ తేది నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. దీంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా, బుధవారం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విజిటర్స్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.