Gujarat Polls : గుజరాత్ ఎన్నికల కోసం జట్టు కట్టిన కాంగ్రెస్, ఎన్‌సీపీ

ABN , First Publish Date - 2022-11-11T16:56:45+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, ఎన్‌సీపీ నిర్ణయించాయి. రాష్ట్రంలోని

Gujarat Polls : గుజరాత్ ఎన్నికల కోసం జట్టు కట్టిన కాంగ్రెస్, ఎన్‌సీపీ
Congress and NCP

న్యూఢిల్లీ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, ఎన్‌సీపీ నిర్ణయించాయి. రాష్ట్రంలోని 182 స్థానాల్లో మూడింటిలో ఎన్‌సీపీ పోటీ చేస్తుందని ఇరు పార్టీల నేతలు శుక్రవారం ప్రకటించారు. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ గుజరాత్ శాఖ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, డిసెంబరు 1, 5 తేదీల్లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీతో కలిసి ఎన్‌సీపీ పోటీ చేస్తుందన్నారు. ఆనంద్ జిల్లాలోని ఉమ్రేథ్, అహ్మదాబాద్‌లోని నరోదా, దహోద్ జిల్లాలోని దేవగఢ్ బరియా నియోజకవర్గాల్లో ఎన్‌సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఈ మూడూ బీజేపీ సిట్టింగ్ స్థానాలు.

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే 46 మంది అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించింది. వీరిలో 21 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు, 18 మంది తొలిసారి పోటీ చేస్తున్నవారు ఉన్నారు. 43 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను గత శుక్రవారం విడుదల చేసింది.

ముంద్రా పోర్టులో ఆట బొమ్మలు, యాక్సెసరీస్ స్వాధీనం : ఈసీ

శాసన సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రికార్డు స్థాయిలో మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు, విలువైన లోహాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ముంద్రా పోర్టులో అక్రమంగా రవాణా అవుతున్న రూ.64 కోట్ల విలువైన ఆటబొమ్మలు, యాక్సెసరీస్‌‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుందని తెలిపింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి పట్టుబడినవాటి విలువ రూ.71.88 కోట్లు అని తెలిపింది.

టిక్కెట్ నిరాకరించడంతో ఆప్‌లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

గుజరాత్‌లోని ఖేదా జిల్లా, మటర్ శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే కేసరి సింహ్ సోలంకి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని ఆప్ గుజరాత్ శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా ఓ ట్వీట్‌లో తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీతో రాజకీయాలు చేస్తుండటంతో ఆయన నుంచి స్ఫూర్తి పొంది, తమ పార్టీలో చేరారని చెప్పారు. సోలంకి ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. తామంతా కలిసి గుజరాత్‌లో నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2022-11-11T16:56:50+05:30 IST