రూ. 46.8 కోట్లతో 256 సంచార వైద్యశాలలు
ABN , First Publish Date - 2022-05-18T13:46:09+05:30 IST
ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.46.8 కోట్ల తో 256 సంచార వైద్యశాలలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రతినెలా
- జెండా ఊపి ప్రారంభించిన Cm Stalin
చెన్నై: ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.46.8 కోట్ల తో 256 సంచార వైద్యశాలలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రతినెలా నిర్ణీత తేదీల్లో వైద్యసేవలకు వీలుగా 389 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల జరిగిన శాసనసభలో ఆరోగ్యశాఖ ఆర్ధిక పద్దులపై జరిగిన చర్చల సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు మొదటి విడతగా 1330 సంచార వైద్యశాలలను ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రెండో విడతగా 256 సంచార వైద్యశాలలను కోట్టూరుపురం వైఎంసీఏ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ జెండాఊపి ప్రారంభించారు. అంబులెన్స్ తరహాలో ఉన్న వాహనాల్లో ఈ సంచార వైద్యశాలలు రోగులకు సేవలందిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి వాహనంలో ఓ వైద్యుడు, నర్సు, డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికుడు ఉంటారని వెల్లడించారు. ఈ సంచార వైద్యశాలలు ప్రభుత్వాస్పత్రులకు దూరంగా ఉన్న కుగ్రామాలకు వెళ్ళి ప్రతినెలా నిర్ణీత తేదీల్లో వైద్యశిబిరాలను నిర్వహించి వైద్యసేవలందిస్తాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.పొన్ముడి, దామో అన్బరసన్, ఎం.సుబ్రమణ్యం, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్, ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ సెల్వవినాయగం, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియా, డిప్యూటీ మేయర్ ఎం. మహే్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.