రానున్న ఏడేళ్లలో 50 వేల కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2022-05-25T16:50:47+05:30 IST
స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రెండోరోజు మంగళవారం కర్ణాటక ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి
- రెన్యూ పవర్ కంపెనీతో దావోస్ లో కీలక ఒప్పందం
- 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
బెంగళూరు: స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రెండోరోజు మంగళవారం కర్ణాటక ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రెన్యూపవర్ కంపెనీ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం రానున్న ఏడేళ్ల అవధిలో రాష్ట్రంలో రూ.50 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరులు, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ విభాగాలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్ నిరాణి దావోస్ నుంచి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పెట్టుబడుల రంగంలో ఇదొక మైలురాయి కానుందన్నారు. కాగా భారతి ఎంటర్ప్రైజస్ చైర్మన్, సీఈఓ సునీల్ భారతి మిట్టల్తో కూడా సీఎం చర్చలు జరిపిన అనంతరం రాష్ట్రంలో మరో మెగా డాటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. తదుపరి సీఎం అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ, వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ ఈవీ రమణారెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్ మంజునాథ ప్రసాద్, పరిశ్రమలశాఖ కమిషనర్ గుంజన్కృష్ణ తదితరులు పాల్గొన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.