నేటినుంచి క్రిస్మస్‌ నెల ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-25T10:41:55+05:30 IST

క్రైస్తవులకు ప్రధానమైన క్రిస్మస్‌ పండుగ నెల శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పండుగ సందర్భగా క్రైస్తవుల ఇంట సందడి ప్రారంభం కాగా, పండుగకు

నేటినుంచి క్రిస్మస్‌ నెల ప్రారంభం

- క్రైస్తవుల ఇంట సందడి

- జోరుగా ‘స్టార్స్‌’ సహా అలంకరణ సామగ్రి విక్రయాలు

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 24: క్రైస్తవులకు ప్రధానమైన క్రిస్మస్‌ పండుగ నెల శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పండుగ సందర్భగా క్రైస్తవుల ఇంట సందడి ప్రారంభం కాగా, పండుగకు వినియోగించే స్టార్స్‌, శాంటాక్లాజ్‌ (క్రిస్మస్‌ తాత) బొమ్మలు, అలంకరణ సామగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి. యేసుక్రీస్తు భూమిపై జన్మించిన రోజును క్రైస్తవులు ‘క్రిస్మస్‌’ పండుగగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవ పార్థనా మందిరాలు, చర్చిలు విద్యుద్దీపాలతో మరింత శోభను సంతరించుకుంటాయి. చర్చి(Church)లకు వచ్చే సభ్యుల ఇళ్లను సందర్శించేందుకు ‘క్యారల్‌ పార్టీ’లకు సంఘ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనల అనంతరం నగరంలోని తమ సభ్యుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెబుతుంటారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి వాహనాల్లో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ సంఘ నాయకులు, మహిళలు, యువకులు, పిల్లలు సభ్యుల ఇళ్లకు వెళ్లి, వారికి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు కానుకలు, 2023 క్యాలెండర్‌ అందజేస్తుంటారు. క్యారల్‌ పార్టీ బృందం తమ ఇంటికి వస్తున్న నేపథ్యంలో, ఇంటి ముందు స్టార్‌, విద్యుద్దీపాలు, గ్రీటింగ్‌ కార్డు, బెలూన్‌లతో అలంకరించిన చెట్లను ఏర్పాటుచేస్తుంటారు. పండుగ రోజైన డిసెంబరు 25వ తేది వరకు క్యారల్‌ పార్టీలు జరుగుతుంటాయి.

Updated Date - 2022-11-25T10:41:57+05:30 IST