Chief Minister: బాలల కోసం త్యాగాలకు సిద్ధం
ABN , First Publish Date - 2022-09-16T15:53:48+05:30 IST
చదువుకునే చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)
- చిన్నారుల ఆకలిని తీర్చడమే లక్ష్యం
- బడి పిల్లలకు అల్పాహార పథకం ప్రారంభించిన సీఎం స్టాలిన్
చెన్నై, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చదువుకునే చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రకటించారు. మదురై కీళ్ అన్నాతోప్పు ప్రాంతంలోని ఆదిమూలం కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం పూట అల్పాహార పథకాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా బడిపిల్లలకు అల్పాహారం తీసుకెళ్లే వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతోకలిసి నేలపై కూర్చుని రవ్వ కిచెడీ, కేసరి, కాయగూరల సాంబారుతో కూడిన అల్పాహారాన్ని ఆయన రుచి చూశారు. ఆ సందర్భంగా తనకిరువైపులా కూర్చున్న బాలబాలికలకు అల్పాహారాన్ని తినిపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్టాలిన్ మాట్లాడుతూ. 102 యేళ్ల క్రితం జస్టిస్ పార్టీ ప్రముఖుడు పిట్టి త్యాగరాయశెట్టి చెన్నై కార్పొరేషన్ సమావేశంలో కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనే తీర్మాణం ప్రతిపాదించారని గుర్తు చేశారు. వందేళ్ల తర్వాత ఆ ప్రముఖుడి ఆశయాన్ని తీర్చేలా తమ ప్రభుత్వం బడిపిల్లల ఆకలి తీర్చేందుకు అల్పాహార పథకాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. ఇకపై పేద ధనిక తేడా లేకుండా బడిపిల్లలంతా రుచికరమైన నాణ్యమైన అల్పాహారంతో ఆకలి తీర్చుకున్న తర్వాతే చదువుకుంటారని చెప్పారు. విద్యార్థుల కోసం మొట్టమొదట మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ 1955లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, 1975లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) ఆ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేశారని, ఆ తర్వాత మరో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఈ పథకంలో మార్పులు చేసి మధ్యాహ్నభోజన పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించారని స్టాలిన్ ప్రశంసించారు. ఎంజీఆర్ మృతి తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేయనున్నదని పుకార్లు పుట్టించారని, చివరకు ఆ పథకంలో కోడిగుడ్డు, అరటిపండు చేర్చి మరింత పటిష్టంగా కరుణానిధి అమలు చేశారని గుర్తు చేశారు. ఆ నేతల అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా తొలివిడతగా 1.14లక్షల మంది బడిపిల్లలు లబ్ది పొందనున్నారని, 1545 పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.